News

నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయం


ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనాలోచిత నిర్ణయమని అని విమర్శించారు. నోట్ల రద్దు నిర్ణయం వెలువడి 30 రోజులు గడిచిన సందర్భంగా పార్లమెంట్‌ ఆవరణలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ బ్లాక్‌డే నిర్వహణకు పిలుపునిచ్చాయి. ఈ ఆందోళనలో పాల్గొన్న రాహుల్‌ పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. ప్రధాని అనాలోచిత చర్య వల్ల దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌ సజావుగా నడిపే బాధ్యత అటు ప్రభుత్వం, స్పీకర్‌పై ఉందన్నారు. కాంగ్రెస్‌ లోక్‌సభా పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వృద్ధి తగ్గిందని.. అదే సమయంలో ప్రజల కష్టాలు మరింత పెరిగాయని విమర్శించారు.